Manish sisodia: తబ్లిగ్ జమాత్ భవనం నుంచి 2361 మందిని ఖాళీ చేయించాం: ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా

  • 36 గంటల విస్తృత ఆపరేషన్ నిర్వహించాం
  • 2361 మందిలో 617 మందిని హాస్పిటల్ కు పంపాం
  • మిగిలిన వారిని వేర్వేరు ప్రాంతాల్లో క్వారంటైన్ లో ఉంచాం
Delhi deputy cm Sisodia statement

ఢిల్లీ లోని మర్కజ్ మసీదులో గత నెల మొదట్లో నిర్వహించిన మతపరమైన కార్యక్రమాలకు దేశ, విదేశాల నుంచి అధిక సంఖ్యలో హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలకు హాజరైన వారిలో ఇప్పటికే పలువురు కరోనా వైరస్ బారిన పడగా, మరికొందరికి ఆ వైరస్ లక్షణాలు ఉన్నాయి. పాజిటివ్ ఉన్న వారిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తుండగా, అనుమానితులను క్వారంటైన్ కు పంపారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ లో ఉన్న తబ్లిగ్ జమాత్ భవనం నుంచి 2,361 మందిని తరలించే కార్యక్రమం ఈరోజు తెల్లవారుజాముతో ముగిసింది. ఇందుకోసం 36 గంటల ఆపరేషన్ నిర్వహించారు. పలు శాఖల సిబ్బంది శ్రమించాల్సి వచ్చిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వెల్లడించారు.

వైద్య, పోలీస్, ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ), ఇతర శాఖల సహాయ సహకారాలతో గత 36 గంటల్లో విస్తృతమైన ఆపరేషన్ నిర్వహించామని చెప్పారు. ఆ భవనం నుంచి ఖాళీ చేయించిన వారిని తరలించే ప్రక్రియ ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కొనసాగిందని వివరించారు. 2361 మందిలో 617 మందిని హాస్పిటల్ కు పంపామని, మిగిలిన వారిని వేర్వేరు ప్రాంతాల్లో క్వారంటైన్ లో ఉంచామని సిసోడియా చెప్పారు.

కాగా, మర్కజ్ భవన్ సహా దాని పరిసరాలను శానిటైజ్ చేసినట్టు సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) తెలిపింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మర్కజ్ నిజాముద్దీన్ సమీపంలోని వీధులను అధికారులు మూసివేశారు.

More Telugu News