star hotels: పలు నగరాల్లో ప్రభుత్వాల అధీనంలోకి స్టార్​ హోటళ్లు, రిసార్టులు!

  • కరోనా బాధితులకు చికిత్స కోసం వినియోగం
  • క్వారంటైన్, ఐసోలేషన్ సౌకర్యాల ఏర్పాటు
  • జాబితాలో స్టార్ హోటళ్లు కూడా
States taking over star hotels across india

కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా పలు నగరాల్లోని ప్రైవేటు హోటళ్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధీనంలోకి తీసుకుంటున్నాయి. కరోనా బాధితులు ఎక్కువగా ఉన్న నగరాల్లో వారికి  హోటళ్లలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందించాలని నిర్ణయించాయి. ఇందుకు పలు సౌకర్యాలు ఉన్న స్టార్ హోటళ్లను కూడా ఉపయోగించుకుంటున్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్, ఉజ్జయిన్ నగరాలపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఈ రెండు నగరాల్లోనే 70 శాతం ఉన్నాయి. దాంతో, శివరాజ్ సింగ్ నేతృత్వంలోని నూతన సర్కారు 28 హోటళ్లు, రిసార్టులు, ఫంక్షన్ హాళ్లలో వారికి చికిత్స అందించాలని నిర్ణయించింది. నగరంలో 22 హోట్లళ్లు, రిసార్టులను  క్వారంటైన్ సెంటర్లుగా  మారుస్తున్నట్టు ఇండోర్ డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ వివేక్ శోత్రియా తెలిపారు. వీటిలో 1200 మంది పేషెంట్లకు చికిత్స అందిస్తామని, అవసరమైతే మరిన్ని బిల్డింగ్‌లను కూడా అధీనంలోకి తీసుకుంటామని చెప్పారు.

కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న బిల్వారా టౌన్‌లో 20 హోటళ్లను రాజస్థాన్‌ ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్లుగా మార్చింది. ఈ హోటళ్లలో 1500 గదులను బుక్ చేశామని, ప్రస్తుతం 600 మందిని క్వారంటైన్‌లో ఉంచామని బిల్వారా జిల్లా కలెక్టర్ రాజేంద్ర భట్ చెప్పారు. ఇక, జైపూర్లో దాదాపు పది వేల అత్యవసర ఐసోలేషన్ బెడ్లు ఏర్పాటు చేసేందుకు హోటళ్లు, ప్రైవేట్ ఆసుపత్రులు, యూనివర్సిటీ హాస్టళ్లు, కమ్యూనిటీహాళ్లు, క్లబ్బులను  అధికారులు గుర్తించారు.

కరోనాను ఎదుర్కొనేందుకు రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో బ్రిటీష్ కాలం నాటి ‘అంటు వ్యాధుల చట్టం-1897’ అమలు చేసిన తర్వాత అధికారులు హోటళ్లను తమ అధీనంలోకి తీసుకుంటున్నారు.  

 కేరళలో ‘కొవిడ్ కేర్ సెంటర్లు’

కేరళలో కూడా పలు జిల్లాల్లో హోటళ్లు ఇతర భవనాలను ప్రభుత్వం గుర్తించింది. ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు కోసం ఒక్క ఎర్నాకుళం జిల్లాలోనే హోటళ్లు, హాస్టళ్లు సహా 74 భవనాలను తీసుకున్నారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కొసర్గాడ్‌ జిల్లాలో మూడు హోటళ్లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చారు. పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలేని వయానాడ్‌లో ఏకంగా 134 హోటళ్లలో 1900 గదులను గుర్తించి, కొన్నింటిని ఇప్పటికే ‘కొవిడ్ కేర్ సెంటర్లు’గా మార్చారు. అలాగే, తొమ్మది రిసార్టుల్లో 152 మందిని పరిశీలనలో ఉంచారు. తిరువనంతపురంలో ప్రముఖ మస్కట్ హోటల్ సహా పలు హోటళ్లలో  రోగులుకు చికిత్స అందించాలని భావిస్తున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం లక్నో, ఆగ్రాలో నాలుగు స్టార్ హోటల్స్‌ను అధీనంలోకి తీసుకుంది. అలాగే, గోవాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో టూరిజం కార్పొరేషన్ భవనాలతో పాటు ఓ ప్రైవేట్ రిసార్టులో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కర్ణాటక ప్రభుత్వం.. బెంగళూరులో 16 హోటళ్లలో క్వారంటైన్ సేవలు అందిస్తోంది.

More Telugu News