Corona Virus: కరోనా నేపథ్యంలో.. ముంబైలో అద్దెలను రద్దు చేస్తున్న భవన యజమానులు!

  • లాక్ డౌన్ తో ప్రజలకు పెరిగిన ఆర్థిక కష్టాలు
  • భారంగా మారుతున్న అద్దెలు
  • అద్దెకుంటున్నవారిపై కనికరం చూపుతున్న యజమానులు
Landlords waive rent due to coronavirus lockdown

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ప్రజలకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఇబ్బంది పడకుండా పలు చర్యలను తీసుకుంటున్నాయి. ఆర్బీఐ సైతం ఈఎంఐల చెల్లింపులపై మూడు నెలల పాటు మారటోరియం విధించింది. ఈ పరిస్థితుల్లో ముంబైలోని భవన యజమానులు మానవతా దృక్పథంతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ ఇళ్లలో అద్దెకు ఉంటున్న వారి నుంచి రెంట్ వసూలు చేయకూడదని నిర్ణయించారు.

ఈ సందర్భంగా  ఒక లీడింగ్ బ్రోకరేజ్ సంస్థ ప్రెసిడెంట్ విక్రమ్ మెహతా మాట్లాడుతూ, బిజినెస్ లేకపోతే అద్దె చెల్లించడం కష్టమవుతుందని... అందువల్లే అద్దె వసూలు చేయవద్దని యజమానులను తాను ఒప్పించానని తెలిపారు.

సామాన్యుల సంపాదనలో ఎక్కువ భాగం ఇంటి అద్దెకే సరిపోతుందనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో, ముంబైలోని జుహు, అంధేరి ప్రాంతాల్లోని ముగ్గురు భవన యజమానులు వారి టెనెంట్లకు మూడు నెలల పాటు అద్దె వసూలు చేయకూడదని నిర్ణయించారు. ప్రముఖ సంస్థ లోథా గ్రూప్ కూడా దక్షిణ ముంబైలోని థానే, పూణేల్లోని తమ 200 మంది కమర్షియల్ టెనెంట్లకు అద్దె రద్దు చేశామని తెలిపింది. సదరు కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారు శాలరీలు ఇవ్వాల్సి ఉంటుందని, ఇదే సమయంలో వారి కుటుంబాలను చూసుకోవాలని, ఈ పరిస్థితుల్లో అద్దెలు చెల్లించడం వారికి చాలా కష్టమని, వారి సమస్యలను తగ్గించడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.

ఇదే సమయంలో లలిత్ మంగ్తానీ అనే వ్యక్తి  మాట్లాడుతూ, చాలా కుటుంబాలకు అద్దెలే ప్రధాన ఆదాయ వనరు అని చెప్పారు. తమ కుటుంబానికి అద్దెల ద్వారా మాత్రమే ఆదాయం వస్తుందని... అయినప్పటికీ ప్రస్తుత సమస్యను దృష్టిలో ఉంచుకుని అద్దెను 50 శాతం తగ్గించామని తెలిపారు. కండావలి అనే ప్రాంతంలో ఈయనకు పలు షాపులు ఉండటం గమనార్హం.

More Telugu News