Corona Virus: కరోనా మృతుడి అంత్యక్రియలకు బంధువులే నిరాకరించిన దయనీయ పరిస్థితి!

  • పశ్చిమ బెంగాల్ లో కరోనా బాధితుడి మృతి
  • ఐసోలేషన్ లో కుటుంబసభ్యులు
  • మృతదేహాన్ని తీసుకునేందుకు వెనుకంజ వేసిన బంధువులు
Relatives refused to take dead body of a corona positive man

భారత్ ఎన్నడూ చూడని పరిస్థితులను కరోనా మహమ్మారి తీసుకువచ్చింది. కోల్ కతాలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందగా, అతడికి అంత్యక్రియలు చేసేందుకు బంధువులు నిరాకరించారు. పశ్చిమబెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి (57) ఇటీవలే కరోనా బారినపడ్డాడు. అతడికి భారత గడ్డపైనే కరోనా సోకింది. అయితే చికిత్స పొందుతూ మరణించాడు. అప్పటికే అతడి భార్య సహా ఇతర కుటుంబసభ్యులను ఐసోలేషన్ లో ఉంచారు. దాంతో మృతదేహాన్ని తీసుకెళ్లాలని బంధువులను కోరగా వారు ఒప్పుకోలేదు. వైరస్ ఎక్కడ తమకు అంటుకుంటుందోనని భయపడ్డారు. దాంతో చేసేది లేక అధికారులు మృతుడి భార్యతో సంతకం చేయించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమావళి అనుసరించి స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

ఆ అంత్యక్రియలు కూడా అంత తేలిగ్గా ఏమీ జరగలేదు. అంతిమ సంస్కారాలకు స్థానికులు కూడా నిరాకరించడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కాగా, మృతుడికి ఎలాంటి విదేశీ ప్రయాణాల చరిత్ర లేదు. అతడికి భారత్ లోనే ఇతరుల ద్వారా సోకడాన్ని బట్టి కరోనా ఇప్పుడు తదుపరి దశకు చేరినట్టు అర్థమవుతోంది.

More Telugu News