CBDT: ఈ పరిస్థితుల్లో మార్చి 31 డెడ్ లైన్ కొనసాగిస్తే అతిపెద్ద తప్పు చేసినట్టే!: ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగులు

  • పన్ను వివాదాల పరిష్కారానికి కొత్త స్కీమ్
  • తుది గడువు మార్చి 31
  • లక్ష్యాన్ని చేరుకోలేమంటూ చేతులెత్తేసిన ఉద్యోగ సంఘాలు
  • కరోనా కారణంగా రెండు నెలలు పొడిగించాలని వినతి
IT Employees want March 31 deadline to be extend

ఇటీవల కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన 'వివాద్ సే విశ్వాస్' స్కీమ్ డెడ్ లైన్ ను మార్చి 31 తరువాత పొడిగించకుంటే, అతిపెద్ద తప్పు చేసినట్టు అవుతుందని ఆదాయపు పన్ను శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. పెండింగ్ లో ఉన్న పన్ను వివాదాలను పరిష్కరించేందుకు ఈ పథకాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) రూపొందించిన సంగతి తెలిసిందే. దీనికి మార్చి 31 డెడ్ లైన్. అయితే, ఇప్పుడు తుది గడువును జూన్ నెలాఖరు వరకూ పొడిగించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

ఈ మేరకు సీబీడీటీకి ఇప్పటికే లేఖలు పంపిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్స్, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న ఈ సమయంలో ఉద్యోగుల ముందు ఎంతో పని ఒత్తిడి ఉందని, వారు లక్ష్యాలను చేరుకునే అవకాశాలు లేవని వాపోతున్నారు. ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వమే ఆదేశించిన వేళ, కరోనా భయాలు మనసులో ఉండగా, పన్ను వివాదాలను పరిష్కరించడం అంత సులువు కాదన్నది ఉద్యోగ సంఘాల అభిప్రాయం.

ఇన్ కంటాక్స్ విభాగంలో ఐటీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, ఐటీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ విభాగాలుండగా, తొలి రెండు సంఘాల్లోనే 97 శాతం మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఐఆర్ఎస్ విభాగంలోని ఉద్యోగులంతా ఉన్నతాధికారులుగానే ఉన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరాన్ని జూలై 1 తరువాత ప్రారంభించాలని కూడా ఉద్యోగ సంఘాలు సీబీడీటీని, ప్రభుత్వాన్ని కోరాయి. కాగా, ఈ విషయంలో సీబీడీటీ నిర్ణయం అతి త్వరలోనే వెలువడుతుందని సమాచారం.

More Telugu News