Corona Virus: రెండు రాష్ట్రాలు మినహా దేశమంతా లాక్‌డౌన్‌

  • 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంతా బంద్‌
  • పంజాబ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధింపు
  • 471కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు
30 States Under Total Lockdown As Coronavirus Cases Cross 470

కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు యావత్‌ దేశం ఒక్కటై పోరాడుతోంది. రెండు రాష్ట్రాలు మినహా దేశమంతటా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. సోమవారం రాత్రి వరకు 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. మిజోరం, సిక్కిం మాత్రమే ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దేశవ్యాప్తంగా 548 జిల్లాల్లో పూర్తిగా బంద్‌ కొనసాగుతోంది. పంజాబ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు.

దేశంలో కరోనా బాధితుల సంఖ్య 471కి చేరగా.. ఇప్పటిదాకా తొమ్మిది మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే కొత్తగా  75 కేసులు నమోదవగా.. ఇద్దరు చనిపోయారు. ఇందులో ఒకరు బెంగాల్‌కు చెందిన వ్యక్తి కాగా మరొకరు హిమాచల్ ప్రదేశ్ నివాసి. బెంగాల్‌లో మృతి చెందిన 57 ఏళ్ల వ్యక్తి  విదేశాలకు వెళ్లిరాలేదు. దాంతో, దేశంలో వైరస్‌ వ్యాప్తిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

ప్రజలు బయటికి రాకుండా కఠిన ఆంక్షలు విధించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే, దేశవాళీ విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ రోజు రాత్రి 12 గంటల్లోపు తమ తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని విమాన సంస్థలకు తెలిపింది. కేవలం కార్గో విమానాలకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది.

More Telugu News