Corona Virus: తొమ్మిది వేలకు సమీపంలో కరోనా మృతుల సంఖ్య.. యూరప్​ దేశాల్లో కల్లోలం

  • 2,18,631 దాటిన బాధితులు
  • ఇటలీ, ఇరాన్, స్పెయిన్ దేశాల్లో కలకలం
  • చైనాలో మాత్రం తగ్గుముఖం పట్టిన వైరస్
Corona cases rapidly raises in many countries

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరింతగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 160కిపైగా దేశాల్లో వైరస్ విస్తరించింది. ముఖ్యంగా యూరప్ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారినపడ్డ వారి సంఖ్య 2,18,631 దాటింది. మృతుల సంఖ్య 8,809 దాటింది. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ కరోనా పరిస్థితిపై వివరాలు వెల్లడించింది.

ఇటలీలో దారుణంగా పరిస్థితి

కరోనా వైరస్ యూరప్ దేశాల్లో ఎక్కువగా ప్రభావం చూపిస్తుండగా.. ప్రధానంగా ఇటలీలో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు.. వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్క రోజే ఏకంగా 475 మంది చనిపోయారు. కరోనా వైరస్ కారణంగా ఒక దేశంలో ఒకే రోజు ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారి. ఇటలీలో వైరస్ బారినపడ్డ వారి సంఖ్య 35 వేలు దాటగా.. చనిపోయిన వారి సంఖ్య 2,978కి చేరింది.

స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీల్లోనూ..

స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీల్లోనూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇందులో స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో మరణాల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. ఇరాన్ లోనూ పరిస్థితి భయానకంగా ఉంది. జర్మనీలో మాత్రం ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నా మరణాల సంఖ్యను నియంత్రించగలుతోంది.

అమెరికాలో ప్రజాప్రతినిధులకూ కరోనా

అమెరికాలో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కొన్ని రోజుల్లోనే వేల మందికి సోకింది. ఇప్పటివరకు 8,736 కేసులు నమోదయ్యాయని, 149 మంది మరణించారని అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ఇద్దరు యూఎస్ కాంగ్రెస్ ప్రతినిధులకు కూడా కోవిడ్ వ్యాధి సోకినట్టు తెలిపారు. అమెరికాలో ప్రధానంగా న్యూయార్క్, వాషింగ్టన్ లలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.

కోలుకుంటున్న చైనా

కరోనా వైరస్ వ్యాప్తికి మూలమైన చైనాలో కరోనా కేసులు దాదాపుగా ఆగిపోయాయి. చికిత్స పొందుతున్నవారిలోనూ చాలా మంది కోలుకున్నారు. ఆ దేశంలో మొత్తంగా 80,928 కేసులు నమోదుకాగా.. 3,245 మంది చనిపోయారు. కొత్తగా అక్కడి స్థానికుల్లో ఒక్కరికి కూడా వైరస్ సోకలేదు.

More Telugu News