Corona Virus: తల్లి గర్భంలోని శిశువులకు కరోనా సోకదు.. చైనా వర్శిటీ అధ్యయనంలో వెల్లడి!

  • వూహాన్ లో నలుగురు గర్భవతులను పరీక్షించిన శాస్త్రవేత్తలు
  • ఇప్పటికే టీకాను అభివృద్ధి చేయడంలో ముందడుగు
  • మానవులపై ప్రయోగిస్తున్న వైద్యులు
Corona Didnot Impact on New Born Babys

కరోనా వైరస్ తల్లి గర్భంలోని శిశువులకు సోకదని చైనాకు చెందిన ఓ యూనివర్శిటీ తన స్టడీ రిపోర్టులో పేర్కొంది. తల్లికి వైరస్ ఉన్నప్పటికీ, బిడ్డకు అది సోకదని తేలింది. దీంతో నవజాత శిశువులకు ఈ వైరస్ సోకదని ' ఫ్రాంటియర్స్‌ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌' లేటెస్ట్ ఎడిషన్ లో హౌఝాంగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

కరోనా వైరస్ పుట్టిన వూహాన్ లో నలుగురు నెలలు నిండి గర్భవతులపై తాము అధ్యయనం చేశామని, పుట్టిన ముగ్గురు బిడ్డలకు సాధారణ ఆహారమే అందించినా, ఎవరిలోనూ కరోనా లక్షణాలు లేవని,  నాలుగో బిడ్డపై అధ్యయనానికి తల్లి అంగీకరించలేదని తెలిపారు. ఒక బిడ్డకు మాత్రం కొద్దిపాటి శ్వాస సమస్యలు తలెత్తినా, వెంటనే కోలుకుందన్నారు.

కాగా, కరోనాను నివారించేందుకు వాక్సిన్ ను అభివృద్ధి చేసే పనులు ప్రపంచవ్యాప్తంగా ఊపందుకున్నాయి. యూఎస్ లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆర్థిక సాయంతో ఓ యువతికి ఈ టీకా వేశారు. ఆమె కరోనాను తట్టుకుంటే, తదుపరి పరీక్షలు జరుగుతాయి. పూర్తి స్థాయిలో పరీక్షలు పూర్తయి, వాక్సిన్ అందుబాటులోకి రావాలంటే, దాదాపు ఏడాదిన్నర సమయం పట్టే అవకాశాలున్నాయి.

సియాటెల్‌ కేంద్రంగా పనిచేస్తున్న కైసర్‌ పెర్మనెంటే వాషింగ్టన్‌ హెల్త్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ లో ఆరోగ్యంగా ఉన్న 45 మంది వాలంటీర్లకు ఎన్‌ఐహెచ్, మోడెర్నా అనే కంపెనీలు టీకాలు ఇవ్వనున్నాయి. దీని కారణంగా తీవ్రమైన దుష్ప్రభావాలేమీ రావని నిర్ధారించుకునేందుకే ఈ ప్రయోగం జరుగుతోందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. టీకా తీసుకున్న వ్యక్తికి వైరస్ సోకదని భరోసా ఇస్తున్నారు.

More Telugu News