Andhra Pradesh: నిన్న రాత్రి హడావుడిగా నిశ్చితార్థం.. నేడు నామినేషన్‌ వేయనున్న అమ్మాయి!

  • ప్రకాశం జిల్లాలో ఘటన
  • కురిచేడు ఎంపీపీ పదవి ఓసీ మహిళకు రిజర్వ్‌ 
  • తన కుటుంబం నుంచే పదవి దక్కాలని కొడుకుకు నిశ్చితార్థం
  • కోడలితో నామినేషన్‌ వేయిస్తోన్న వైసీపీ నేత
ap local body elections

వివాహ నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే ఓ యువతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్‌ వేయాల్సి వస్తున్న సంఘటన ప్రకాశం జిల్లా కురిచేడులో చోటు చేసుకుంది. నిన్న రాత్రి  శిరీష అనే యువతికి నిశ్చితార్థం అయింది. ఈ రోజు ఆమె నామినేషన్‌ వేయనుంది.

కాబోయే భర్త కుటుంబం తరఫున ఆమె పోటీకి సిద్ధమై ఎన్నికల బరిలో నిలుస్తోంది. ఇలా హడావిడిగా జరగడానికి కారణముంది. కురిచేడు ఎంపీపీ పదవి ఓసీ మహిళకు రిజర్వ్‌ అయింది. వైసీపీ తరఫున అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను దేకనకొండ గ్రామానికి చెందిన బెల్లం చంద్రశేఖర్‌ కు పార్టీ అప్పగించింది. దీంతో తన కుటుంబం నుంచే అభ్యర్థిని నిలపాలని ఆయన భావించారు.

ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. దీంతో ఆయన తన పెద్ద కుమారుడు సురేష్‌కు వివాహం చేయాలని నిర్ణయించుకుని, వెంకట నర్సయ్య అనే వ్యక్తి కుమార్తె శిరీషతో నిన్న రాత్రి హడావుడిగా నిశ్చితార్థం చేసుకున్నాడు. నేటితో ఎంపీటీసీ పదవులకు నామినేషన్‌ గడువు ముగుస్తుంది. దీంతో తనకు కాబోయే కోడలితో చంద్రశేఖర్‌ ఈ రోజు నామినేషన్‌ వేయించనున్నారు.

More Telugu News