Devineni Uma: జగన్ కు ఓటమి భయం పట్టుకుంది.. వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి: దేవినేని ఉమ

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే పదవులు వదులుకోవాలని మంత్రులను బెదిరిస్తున్నారు
  • ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే అమరావతిని చంపేస్తారు
  • కృష్ణప్రసాద్ కేకలు, రంకెలకు భయపడే వ్యక్తిని కాను
Devineni Uma fires on Jagan

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయం ముఖ్యమంత్రి జగన్ కు పట్టుకుందని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అందుకే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాల్సిందేనని మంత్రులు, ఎమ్మెల్యేలకు బెదిరింపులు పంపారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోతే మంత్రులు రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా లేఖలు ఇవ్వాలని, ఎమ్మెల్యేలు పదవులు వదులుకోవాలని జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయనలోని అభద్రతా భావాన్ని సూచిస్తున్నాయని చెప్పారు.

151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే అహంకారంతో రాజధాని విషయంలో మూడు ముక్కలాటను జగన్ ఆడుతున్నారని దేవినేని ఉమ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ గెలిస్తే అమరావతిని పూర్తిగా చంపేసి... వైజాగ్ కు దుకాణాన్ని మారుస్తారని చెప్పారు. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు వైజాగ్ లో ఇళ్లను చూసుకుని వచ్చారని విమర్శించారు.

జగన్ ను ప్రశ్నిస్తే తనకు మూడినట్టేనంటూ వసంత కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చాలా విడ్డూరంగా ఉన్నాయని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. కృష్ణప్రసాద్ కేకలు, రంకెలకు తాను భయపడే వ్యక్తిని కాదని చెప్పారు. ఐదేళ్లకోసారి పార్టీ మారే వ్యక్తి కృష్ణప్రసాద్ అని విమర్శించారు. అవకాశవాద రాజకీయ నాయకుల మాటలను ప్రజలు వినొద్దని... స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు.

More Telugu News