Wife: లిథువేనియా దేశంలోని విల్నియస్ నగరంలో కరోనా భయంతో భార్యను బాత్ రూమ్ లో బంధించిన భర్త!

  • తనకు కరోనా సోకిందేమోనని చెప్పిన మహిళ
  • బాత్ రూమ్ లో బంధించిన భర్త, ఇద్దరు కుమారులు
  • లిథువేనియా దేశంలో చోటుచేసుకున్న ఘటన
Man Locks Wife In Bathroom Over Coronavirus Fears

ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయాందోళనలు ఏ స్థాయికి చేరుకున్నాయో చెప్పడానికి ఇదొక సజీవ సాక్షం. కరోనా భయాలతో ఓ భర్త తన భార్యను ఏకంగా బాత్ రూమ్ లోనే బంధించేశాడు. ఈ ఘటన లిథువేనియా దేశంలోని విల్నియస్ నగరంలో చోటు చేసుకుంది.

ఈ ఘటనపై అక్కడి పోలీసు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... తనను బాత్ రూమ్ నుంచి బయటకు రాకుండా తన భర్తతో పాటు మేజర్లయిన ఇద్దరు కుమారులు అడ్డుకుంటున్నారని ఒక మహిళ పోలీసులకు సమాచారం అందించింది. తనకు కరోనా సోకిందేమోనని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది.

విదేశాల నుంచి వచ్చిన ఒక వ్యక్తితో తాను మాట్లాడానని... తనకు కూడా కరోనా సోకి ఉండొచ్చని ఆమె తెలిపింది. దీంతో, భయాందోళనలకు గురైన వారు ఆమెను బాత్ రూమ్ లో బంధించారు. ఆమెను అక్కడి నుంచి బయటకు రానివ్వలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ ఎలాంటి గొడవ కానీ, హింస కానీ లేకపోవడంతో... అంబులెన్స్ ను పిలిపించి, ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. తన కుటుంబ సభ్యులపై సదరు మహిళ ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో, పోలీసులు వారిపై కేసు నమోదు చేయలేదు.

మరోవైపు, యూరప్ లో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. ఒక్క ఇటలీలోనే మృతుల సంఖ్య నిన్నటికి 100 దాటింది. ప్రపంచ వ్యాప్తంగా 3 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News