IPL: ఐపీఎల్‌ జట్లకు షాక్.. ప్రైజ్‌మనీ సగానికి తగ్గించాలని బీసీసీఐ నిర్ణయం?

  • విజేతకు రూ. 20 నుంచి 10 కోట్లకు తగ్గింపు
  • కాస్ట్ కటింగ్స్‌లో భాగంగా బీసీసీఐ కీలక నిర్ణయం!
  • అన్ని ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చిన బోర్డు
IPL Prize Money Reduced To Half

ఐపీఎల్‌ పదమూడో ఎడిషన్‌ కోసం సిద్ధమవుతున్న జట్లకు షాకింగ్‌ న్యూస్‌. ఈ సీజన్‌ ట్రోఫీ నెగ్గి 20 కోట్లు కైవసం చేసుకోవాలనుకుంటున్న టీమ్స్‌ ఆశలపై బీసీసీఐ నీళ్లు కుమ్మరించేలా ఉంది. ఎందుకంటే కొత్త సీజన్‌ ప్రైజ్‌మనీని సగానికి తగ్గించాలని బోర్డు భావిస్తోంది. తమ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.

 ప్రైజ్‌మనీ తగ్గింపు విషయాన్ని అన్ని ఫ్రాంచైజీలకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేసిందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ లెక్కన గత సీజన్‌ వరకూ టైటిల్‌ విజేత రూ. 20 కోట్లు నగదు బహుమతిగా అందుకోగా ఈ సారి కేవలం రూ. 10 కోట్లు మాత్రమే ఖాతాలో వేసుకోనుంది. అలాగే, రన్నరప్‌ టీమ్‌కు అందించే మొత్తం 12.5 కోట్ల నుంచి 6.25 కోట్లకు తగ్గనుంది.

ఇక, క్వాలిఫయర్స్‌లో ఓడిన జట్లు చెరో 4.37 కోట్లను అందుకుంటాయి. ప్రస్తుతానికి అన్ని ఫ్రాంచైజీలు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండడంతో పాటు, తమ ఆదాయాన్నిపెంచుకోవడానికి స్పాన్సర్‌‌షిప్‌ వంటి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయని, అందుకే ప్రైజ్‌మనీని తగ్గించాలన్న నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే ఆయా రాష్ట్రాల క్రికెట్‌ సంఘాలు ఒక్కోదానికి ఫ్రాంచైజీలు రూ. కోటి అందించనున్నాయి. అలాగే, బీసీసీఐ రూ. 50 లక్షలు ఇవ్వనుంది.

ఆసియా దేశాలకు బిజినెస్ క్లాస్‌ ప్రయాణం రద్దు 

కాస్ట్ కంటింగ్స్‌లో భాగంగా బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. భారత్ నుంచి ఆసియా దేశాలకు ప్రయాణించే బీసీసీఐ మధ్య శ్రేణి ఉద్యోగులకు బిజినెస్‌ క్లాస్‌ విమాన ప్రయాణ సదుపాయాన్ని కూడా రద్దు చేయనుంది. శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ వెళ్లేందుకు ఎనిమిది గంటలకు మించి సమయం పట్టదు కాబట్టి ఉద్యోగులు సాధారణ క్లాస్‌లోనే ప్రయాణించాలని నిర్ణయించింది.

More Telugu News