వంతెనపై అదుపుతప్పి నదిలో పడిన బస్సు: పెళ్లి బృందంలోని 24 మంది మృతి

  • బస్సులో మొత్తం 40 మంది వరుడి కుటుంబీకులు
  • రాజస్థాన్‌ రాష్ట్రంలో ఘోర దుర్ఘటన
  • బూండీలోని కోటలాల్‌సాత్‌ మెగా హైవేపై ఈరోజు ఉదయం ఘటన
రాజస్థాన్‌ రాష్ట్రం బూండీ జిల్లాలోని కోటలాల్‌సాత్‌ మెగా హైవేపై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలభై మందితో వెళ్తున్న ఓ పెళ్లి బృందం (బరాతీస్) బస్సు వంతెనపై అదుపు తప్పి మేజ్‌ నదిలో పడిపోయిన ఘటనలో 24 మంది చనిపోయారు. పోలీసుల సమాచారం మేరకు...బూండీలోని కోటకు చెందిన వరుని కుటుంబ సభ్యులు 40 మంది ఒకే బస్సులో సవాయ్‌మాదోపూర్‌లో జరగనున్న పెళ్లి మండపానికి బయలుదేరారు.

అతివేగంగా వస్తున్న బస్సు లకేరీ పట్టణం పరిధిలోని వంతెన వద్ద అదుపుతప్పింది. డ్రైవర్‌ ప్రమాదాన్ని గ్రహించేలోపే నదిలోకి దూసుకుపోవడంతో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే 24 మంది చనిపోయినట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Go Back to Shorts
Crime News
bus runaway in to river
24 dead
Rajasthan
wedding peopla

More Telugu News