నిన్నటి మందడం ఘటనలో నిందితులను అరెస్టు చేశాం: తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస్​ రెడ్డి

 Tulluru DSP clarification about Mandadam incident
  • రైతులు రోడ్డుపై ధర్నా చేస్తుండటం వల్లే డ్రోన్ తో చిత్రీకరించాం
  • ఓ మహిళ స్నానం చేస్తుండగా చిత్రీకరించారన్నది అబద్ధం
  • హోం మంత్రి, డీజీపీ కాన్వాయ్ లను, ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్న నిందితులను అరెస్టు చేశాం
ఏపీ రాజధాని ప్రాంతం మందడంలో నిన్న జరిగిన ఘటనపై తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు. రైతులు రోడ్డుపై ధర్నా చేస్తుండటం వల్లే డ్రోన్ తో చిత్రీకరించామని చెప్పారు. ధర్నా సందర్భంగా ట్రాఫిక్ జామ్ చేశారని, పైగా హై సెక్యూరిటీ జోన్ లో ఉన్నారు కనుక దీనిని ఆపరేట్ చేశామని అన్నారు. రోడ్డుపై కూర్చున్న వారిని మాత్రమే చిత్రీకరించామని, ఆ ప్రాంతంలో ఓ మహిళ స్నానం చేస్తుండగా చిత్రీకరించారన్న వదంతులను నమ్మొద్దని చెప్పారు. డ్రోన్ ను కిందకు దించే సమయంలో ఆపరేటర్ పై దాడి చేసి దానిని ఎత్తుకుపోయారని అన్నారు.

హోం మంత్రి సుచరిత, డీజీపీ కాన్వాయ్ లు వెళ్తుండగా రైతులు తమ ట్రాక్టర్ లు అడ్డుపెట్టారని, ఈ ఘటనలో నిందితులు సహా ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్న వారిపైనా కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం రైతులను కొందరు కావాలనే  రెచ్చగొడుతున్నారని అన్నారు.
Go Back to Shorts
Tulluru
DSP
Srinivas reddy
Suchartia
Roja

More Telugu News