Prakasam District: భర్త అనైతికం...భార్య క్షణికావేశం: దంపతుల ప్రాణాలు తీసిన వివాహేతర బంధం

  • పండంటి కాపురంలో విషాదం
  • భర్త తీరుతో విసిగి భార్య ఆత్మహత్య
  • నదిలో దూకిన ప్రియురాలిని రక్షించబోయి భర్త మృతి
illegal affair causes two lives end

వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. పోలీసుల కథనం మేరకు... ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం చందలూరు బీసీ కాలనీకి చెందిన జి.వేణు (43), ధనలక్ష్మి (38) దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు. వీరు అద్దంకిలోని ఎన్టీఆర్ నగర్‌లో నివాసం ఉంటూ బేల్దారి పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. చీమకుర్తి మండలం నాయుడుపాలెంకు చెందిన పిల్లలున్న ఓ వితంతు మహిళతో వేణుకు వివాహేతర సంబంధం ఉంది.

ఈ కారణంగా రెండు కుటుంబాల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో వేణు ప్రియురాలు హైదరాబాద్ కు మకాం మార్చింది. అయినా ఇద్దరి మధ్య వివాహేతర బంధం కొనసాగుతూ వస్తోంది. సోమవారం ప్రియురాలు అద్దంకి రావడంతో ఆమెను వేణు కలిశాడు. తన ద్విచక్ర వాహనంపై ఇద్దరూ ఆమె స్వగ్రామమైన నాయుడుపాలేనికి వెళ్లారు.

ఈ విషయం వేణు భార్య ధనలక్ష్మికి తెలిసింది. భర్త వివాహేతర సంబంధం ఇంకా కొనసాగుతోందన్న మనస్తాపంతో ధనలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. దీంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం నాయుడుపాలెంలో ఉన్న వేణుకు తెలియడంతో ప్రియురాలితో కలిసి బండిపై ఆసుపత్రికి బయలుదేరాడు.

ప్రియుడి భార్య ఆత్మహత్యా యత్నం తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అని అప్పటికే ఆందోళన చెందుతున్న వేణు ప్రియురాలు వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం గుండ్లకమ్మ వంతెన మీదకు చేరగానే బండి దిగి నదిలోకి దూకేసింది. ఆమెను రక్షించేందుకని వేణు ఆమె వెంటే నదిలోకి దూకాడు.

ఈ ఘటనలో వేణు నదిలోమునిగి చనిపోయాడు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తెల్లవారు జామున ధనలక్ష్మి చనిపోయింది. దంపతులు ఇద్దరూ రోజు వ్యవధిలో చనిపోవడంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు.

More Telugu News