బాలిక అపహరణ.. రెండు గంటల్లోనే ఛేదించిన హైదరాబాద్ పోలీసులు
- రెండేళ్ల చిన్నారిని అపహరించిన ఆటో డ్రైవర్
- శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తండ్రి
- క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిన పోలీసులు
ఫిర్యాదు అందిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా పోలీసులు రంగంలోకి దిగారు. ఒక ఆటో డ్రైవర్ బాలికను అపహరించాడని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఆ ప్రాంతంలో బాటిల్స్, చెత్తను ఆటోలో తరలించే వ్యక్తి బాలికను కిడ్నాప్ చేశాడనే అంచనాకు వచ్చిన పోలీసులు... సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆటో రిజిస్ట్రేషన్ నంబరును గుర్తించారు. నంబర్ ఆధారంగా ఆటో యజమాని వివరాలను సేకరించి వెంటనే అతనికి ఫోన్ చేశారు. వెంటనే ఆటో యజమాని శంషాబాద్ ప్రాంతంలో రాళ్లగూడలో ఉంటున్న సందీప్ (మహారాష్ట్రకు చెందిన వ్యక్తి) గుడిసె వద్దకు పోలీసులను తీసుకెళ్లాడు.
గుడిసెలోకి వెళ్లిన పోలీసులకు సందీప్ కిడ్నాప్ చేసిన చిన్నారి నిద్రిస్తూ కనిపించింది. వెంటనే అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారిని ఆమె తల్లి చేతిలో పెట్టారు. ఈ కిడ్నాప్ ను ఛేదించడానికి పోలీసులు తీసుకున్న సమయం కేవలం రెండు గంటలు మాత్రమే.
ఈ సందర్భంగా ఏసీపీ అశోక్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కిడ్నాపర్ సందీప్ తమను పక్కదోవ పట్టించేందుకు యత్నించాడని తెలిపారు. బాలిక రోడ్డుపై ఒంటరిగా ఉండడంతో, ఆమెను తీసుకొచ్చానని చెప్పాడన్నారు. అయితే బాలిక ఒంటరిగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ చెప్పారు. సందీప్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. మరోవైపు, సందీప్ కు పెళ్లి అయింది. కానీ, ఆ దంపతులకు పిల్లలు లేకపోవడం గమనార్హం.