Pawan Kalyan: ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతుంటే ఉపాధి అవకాశాలు ఎలా మెరుగుపరుస్తారు?: పవన్ కల్యాణ్

  • ‘కియా’ యూనిట్లు పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నాయి
  • ఈ వార్తలు విస్మయానికి గురిచేస్తున్నాయి
  • ఈ విషయాన్ని చెప్పింది ఆషామాషీ వార్తా సంస్థ కాదు  
ఏపీలోని అనంతపురం జిల్లాలో ఉన్న కియా పరిశ్రమలోని యూనిట్లు పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నాయంటూ వస్తున్న వార్తలు విస్మయానికి గురిచేస్తున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ వార్తను ప్రపంచానికి తెలియజేసింది ఏదో ఆషామాషీ సంస్థ కాదని, ‘రాయిటర్స్’ అనే ప్రఖ్యాత వార్తా సంస్థ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలకు ఈ సంఘటన అద్దంపడుతోందని అన్నారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు సానుకూల పరిస్థితులను నెలకొల్పాల్సిన ప్రభుత్వం, ఆ బాధ్యతను విస్మరిస్తోందని విమర్శించారు. కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు, సాఫ్ట్ వేర్ సంస్థలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగవుతాయని ప్రశ్నించారు.

విశాఖలోని మిలీనియం టవర్స్ నుంచి సాఫ్ట్ వేర్ సంస్థలను ఖాళీ చేయించడమంటే ఆ రంగం ఇకపై ఆంధ్రప్రదేశ్ వైపు చూడకుండా చేయడమే అవుతుందని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఉపాధి కల్పనకు ఆస్కారం ఉన్న రంగాలను ప్రోత్సహించకపోగా నిరుత్సాహకర పరిస్థితులు సృష్టిస్తే ఆర్థికాభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

ఏపీలో ఉపాధి అవకాశాలు పెంచి వలసలు అరికట్టాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతలను వదిలేసి రద్దులు, కూల్చివేతలు, తరలింపులు అంటోందని ధ్వజమెత్తారు. నిర్మాణాత్మక ఆలోచనలు, ప్రణాళికలు లేని పాలక పక్షాన్ని చూసే రాష్ట్రం నుంచి పారిశ్రామిక సంస్థలు తరలిపోతున్నాయన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని సూచించారు.
Pawan Kalyan
Janasena
Reuters
KIA Motors

More Telugu News