India: చిచ్చరపిడుగులా చెలరేగిన అయ్యర్... కివీస్ తో తొలి టి20లో టీమిండియాదే విజయం

  • 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా
  • మరో ఓవర్ మిగిలుండగానే పని పూర్తి
  • 5 ఫోర్లు, 3 సిక్సులు బాదిన అయ్యర్
  • కేఎల్ రాహుల్ ఫిఫ్టీ, రాణించిన కోహ్లీ
సుదీర్ఘమైన న్యూజిలాండ్ పర్యటనను టీమిండియా విజయంతో శుభారంభం చేసింది. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ మైదానంలో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఆతిథ్యజట్టును చిత్తు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్ మన్ శ్రేయాస్ అయ్యర్ విధ్వంసకర బ్యాటింగ్ తో కివీస్ ఆశలపై నీళ్లు చల్లాడు.

 204 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 142 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా, శ్రేయాస్ అయ్యర్ మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడి భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. విన్నింగ్ షాట్ గా ఓ సిక్సర్ బాది మ్యాచ్ ను ముగించాడు. ఈ ముంబై బ్యాట్స్ మన్ కేవలం 29 బంతులాడి 5 ఫోర్లు, 3 సిక్సులతో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఓపెనర్ కేఎల్ రాహుల్ 56 పరుగులు చేయగా, కెప్టెన్ కోహ్లీ 45 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన కివీస్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేయగా, భారత్ ఆ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. ఇక, ఇరు జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ ఇదే మైదానంలో జనవరి 26 ఆదివారం జరగనుంది.
India
Team New Zealand
Team India
T20
Auckland
Sreyas Ayyar

More Telugu News