ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉన్మాది.. ఇద్దరి సజీవ దహనం

షార్ట్స్‌లో చూడండి

నిద్రపోతున్న ఓ కుటుంబం పైకి యమపాశాన్ని విసిరాడు ఓ ఉన్మాది. తాను ప్రేమించిన యువతి వేరొకరిని వివాహమాడిందన్న అక్కసుతో శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ చర్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు చనిపోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్లలో జరిగిన ఈ ఘోరానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.

బాధిత కుటుంబ సభ్యులంతా నిద్రలో ఉండగా ఈ రోజు తెల్లవారు జామున దుండగుడు ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అప్పటికి ఇంట్లో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు నిద్రపోతున్నారు. ఒక్కసారిగా మంటలు విజృంభించడంతో నిద్రలో ఉన్న వారికి మెలకువ వచ్చేసరికే ఆలస్యమయింది. ఇద్దరు చిన్నారులు సజీవ దహనం కాగా, మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించగా వీరి పరిస్థితి కూడా విషమంగా వున్నట్టు వైద్యులు పేర్కొన్నారు. 

కాగా, ఈ ఘటన గ్రామంలో తీవ్ర భయాందోళనలకు కారణమయింది. నిందితుడు శ్రీనివాసే ఈ ఘటనకు పాల్పడ్డాడని, అతన్ని పట్టుకుని శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని శ్రీనివాస్ ఇల్లు, బందువుల ఇళ్లలో అతని కోసం గాలిస్తున్నారు.

Go Back to Shorts
Crime News
East Godavari District
kadiam
dulla village
Fire Accident
two dead

More Telugu News