పాకిస్థాన్ లో... దైవదూషణ చేశాడంటూ ప్రొఫెసర్ కు మరణశిక్ష విధించిన కోర్టు
- దేవుడ్ని కించపరిచాడంటూ ఆరోపణలు
- నిర్బంధంలో ఉంచి విచారణ
- మరణశిక్షతో పాటు ఐదు లక్షల పాకిస్థానీ రూపాయల జరిమానా
ఆరేళ్ల క్రితం ప్రొఫెసర్ జునైద్ హఫీజ్ ఖాన్ ముల్తాన్ నగరంలోని ఓ విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ దేవుడ్ని కించపరిచే వ్యాఖ్యలు చేశాడంటూ ఆయనపై అభియోగాలు మోపారు. 2013 నుంచి ఆయన నిర్బంధంలోనే ఉన్నారు. బయట ఉంటే ఆయన ప్రాణాలకు ముప్పుందని, నిర్బంధంలో ఉంచి విచారణ కొనసాగించారు. తాజాగా, ఈ కేసులో కోర్టు తీర్పునిస్తూ మరణదండన విధిస్తున్నట్టు తెలిపింది.
కాగా, సదరు ప్రొఫెసర్ ఈ తీర్పును ఉన్నతస్థాయి కోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించుకున్నారు. పాక్ లో దైవదూషణ చట్టాన్ని మైనారిటీలను అణచివేసేందుకు ఉపయోగిస్తున్నారని హక్కుల సంఘాలు ఎప్పట్నించో మొత్తుకుంటున్నాయి.