'గులాబీ' టెస్టులో భారత్ కు అదిరేటి ఆరంభం... బంగ్లాదేశ్ 106 ఆలౌట్

  • కోల్ కతాలో చారిత్రక టెస్టు మ్యాచ్
  • తొలి డేనైట్ టెస్టులో చెలరేగిన భారత బౌలర్లు
  • కుప్పకూలిన పర్యాటక జట్టు
  • ఇషాంత్ కు ఐదు వికెట్లు
కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న చారిత్రాత్మక డేనైట్ టెస్టులో భారత్ కు శుభారంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ కేవలం 30.3 ఓవర్లు ఆడి 106 పరుగులకే ఆలౌట్ అయింది. గులాబీ రంగు బంతితో చెలరేగిన టీమిండియా బౌలర్లు బంగ్లా బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశారు. ముఖ్యంగా ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ బంగ్లా వికెట్ల కోసం పోటీలు పడ్డారు. ఇషాంత్ శర్మ నిప్పులు చెరిగే బౌలింగ్ తో 5 వికెట్లు సాధించడం మ్యాచ్ లో హైలైట్ అని చెప్పాలి.

పింక్ బాల్ సీమ్ ను అద్భుతంగా ఉపయోగించుకున్న ఇషాంత్ బంగ్లాదేశ్ ఆటగాళ్ల పాలిట ప్రమాదకరంగా పరిణమించాడు. అతనికి ఉమేశ్ యాదవ్ (3 వికెట్లు), షమీ (2 వికెట్లు) నుంచి మంచి సహకారం లభించింది. బంగ్లా తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ షాద్మాన్ చేసిన 29 పరుగులే అత్యధికం. చివర్లో లిటన్ దాస్ (24), నయీమ్ (19) ఓ మోస్తరు పరుగులు చేయడంతో బంగ్లా స్కోరు ఆ మాత్రమైనా వచ్చింది. ఇక, తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 3 ఓవర్లలో 18 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ వున్నారు. 
Go Back to Shorts
India
Bangladesh
Kolkata
Eden Gardens
Pink Ball

More Telugu News