vijayareddy: విజయారెడ్డి హత్య కేసు దర్యాప్తు ముమ్మరం.. ఇంటి వద్దే చంపాలనుకున్న సురేశ్!

  • హత్యకు రెండు రోజుల ముందు ఇంటికెళ్లి విజయారెడ్డి భర్తను కలిసిన సురేశ్
  • హత్య అనంతరం బయటకు వచ్చి కారులోని వ్యక్తులతో మాట్లాడిన నిందితుడు
  • విజయారెడ్డి ఇంటికెళ్లే ముందు స్నేహితులకు ఫోన్ చేసిన సురేశ్

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసు దర్యాప్తు‌ను పోలీసులు ముమ్మరం చేశారు. వనస్థలిపురం ఏసీపీ సారథ్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తులో మరికొన్ని కీలక విషయాలు వెలుగుచూశాయి. విజయారెడ్డిని ఆమె ఇంటి వద్దే సురేశ్ చంపాలనుకున్నట్టు తేలింది. ఇందులో భాగంగా హత్యకు రెండు రోజుల ముందు ఓ మధ్యవర్తితో కలిసి విజయారెడ్డి ఇంటికి వెళ్లిన సురేశ్.. ఆమె భర్త సుభాష్‌రెడ్డిని కలిసినట్టు సమాచారం. ఆయనను ఎందుకు కలిశారు? ఏం మాట్లాడారు? అన్నదానిపై పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

విజయారెడ్డి ఇంటికి వెళ్లే ముందే సురేశ్ తన స్నేహితులకు ఫోన్ చేసి ఈ రోజుతో తాడోపేడో తేలిపోతుందని చెప్పినట్టు తెలిసింది. ఆయన మాటలను బట్టి విజయారెడ్డిని అతడు ఇంటివద్దే హత్య చేయాలని పథకం పన్నినట్టు తెలుస్తోందని పోలీసులు భావిస్తున్నారు. కార్యాలయంలో విజయారెడ్డిని సజీవ దహనం చేసిన తర్వాత తీవ్ర గాయాలతో రోడ్డుపైకి వచ్చిన సురేశ్ రోడ్డు పక్కన ఆగి ఉన్న కారులోని వ్యక్తులతో మాట్లాడినట్టు సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఆ కారులో ఉన్నది ఎవరు? వారితో సురేశ్ ఏం మాట్లాడాడన్న విషయాన్ని పోలీసులు కూపీ లాగుతున్నారు.

More Telugu News