రూ. 10 వేలు ఇస్తే... తీర్థం, శఠారిలతో శ్రీ వెంకటేశ్వరుని బ్రేక్ దర్శనం!

  • ఇప్పటికే వీఐపీ దర్శనాలు రద్దు
  • శ్రీవాణి ట్రస్ట్ ను ప్రారంభించిన టీటీడీ
  • అధిక విరాళమిస్తే ముఖ్యమైన సేవా టికెట్లు
ఇప్పటికే ఎల్-1, ఎల్-2, ఎల్-3 దర్శనాలను రద్దు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం, కొండపై దళారుల ప్రమేయాన్ని పూర్తిగా నివారించే ప్రయత్నాల్లో భాగంగా, దాతల నుంచి విరాళాలు తీసుకుని, వారికి ముఖ్యమైన సేవా టికెట్లను అందించేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా, శ్రీవాణి ట్రస్ట్ ను ప్రారంభించిన టీటీడీ, రూ. 10 వేల విరాళం ఇచ్చే భక్తులకు స్వామి సమక్షంలో తీర్థం, శఠారిలతో కూడిన బ్రేక్ దర్శన సౌకర్యాన్ని కల్పించనుంది. అంతకుమించి విరాళాలు ఇస్తే, ముఖ్యమైన వస్త్రాలంకార, తోమాల, అర్చన వంటి సేవా టికెట్లను ఇవ్వాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.

తొలి దశలో రోజుకు 200 టికెట్లను విడుదల చేస్తూ, ప్రయోగాత్మకంగా పరిశీలించాలని, ఆపై భక్తుల ఆదరణను బట్టి, రోజుకు 1000 టికెట్ల వరకూ కేటాయించాలని భావిస్తున్నామని అధికారులు వెల్లడించారు. దీంతో రోజుకు కనీసం కోటి రూపాయల చొప్పున ఏడాదిలో రూ. 360 కోట్లకు పైగా ఆదాయాన్ని పొందవచ్చని అంచనా వేస్తున్నారు. త్వరలో టీటీడీ పాలకమండలి ఏర్పడి, ఈ విధానానికి ఆమోదం వేస్తుందని, ఆపై సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలవుతుందని తెలుస్తోంది.
Go Back to Shorts
Tirumala
Tirupati
TTD
Break Darshan
Srivani Trust

More Telugu News