Polavaram: పర్యావరణ నిబంధనల్లో ఉల్లంఘనలు.. ‘పోలవరం’ నిర్మాణంపై ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షోకాజ్ నోటీసులు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్ కు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుపైనా కేంద్రం వివరణ కోరినట్టు సమాచారం. కాగా, ‘పోలవరం’, దాని అనుబంధ ప్రాజెక్టులపై కేంద్ర పర్యావరణ శాఖ తనిఖీలు జరిపించింది. తనిఖీల అనంతరం చెన్నై పర్యావరణ శాఖ అధికారులు సంబంధిత నివేదికలను కేంద్రానికి అందజేశారు. పర్యావరణ అనుమతుల నిబంధనల్లో ఉల్లంఘనలు జరిగాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కు చెన్నై పర్యావరణ శాఖాధికారులు ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. ఏపీకి ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టు అందులో పేర్కొన్నారు.