Fire Accident: ఢిల్లీలో ఐదు అంతస్తుల భవనంలో మంటలు.. ఆరుగురి మృతి.. ఏడుగురి పరిస్థితి విషమం

  • ఈ తెల్లవారుజామున ప్రమాదం
  • మృతుల్లో ఇద్దరు చిన్నారులు
  • క్షతగాత్రుల్లో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది

ఢిల్లీలోని జకీర్ నగర్ ప్రాంతంలో ఉన్న ఐదంతస్తుల నివాస భవనంలో ఈ ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు సజీవ దహనం కాగా, మిగతా వారు పొగ కారణంగా ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారని ఢిల్లీ అగ్నిమాపక విభాగం చీఫ్ ఆఫీసర్ అతుల్ గార్గ్ తెలిపారు.

మంటలు చెలరేగిన వెంటనే కొందరు భవనం పైనుంచి దూకి తప్పించుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో వారు గాయపడ్డారని తెలిపారు. గాయపడిన 16 మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. వీరందరూ హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. బిల్డింగ్‌లోని ఎలక్ట్రిక్ మీటర్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News