Dharmasena: వరల్డ్ కప్ ఫైనల్లో తప్పుడు నిర్ణయం వెలిబుచ్చిన అంపైర్ కు ఐసీసీ బాసట

  • ఓవర్ త్రోకు 6 పరుగులు ఇచ్చిన అంపైర్ ధర్మసేన
  • తీవ్రంగా తప్పుబట్టిన విమర్శకులు
  • మైదానంలో ఉన్న ఇద్దరు అంపైర్లు సవ్యంగానే వ్యవహరించారన్న ఐసీసీ
ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ లో ఫైనల్ మ్యాచ్ ఎంత హోరాహోరీగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటగాళ్ల పోరాటపటిమ అటుంచితే అంపైర్ కుమార ధర్మసేన ఒక ఓవర్ త్రోకు 6 పరుగులు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి ఆ సమయంలో ఇవ్వాల్సింది 5 పరుగులేనని ప్రతి ఒక్కరూ అంపైర్ ను విమర్శించారు. ఓవర్ త్రో విషయంలో తాను తీసుకుంది తప్పుడు నిర్ణయమేనని ఇప్పటికే ధర్మసేన కూడా అంగీకరించాడు. అయితే, ఐసీసీ మాత్రం తమ అంపైర్ కు బాసటగా నిలిచింది.

ఓవర్ త్రో పరుగులను ప్రకటించే క్రమంలో మైదానంలోని అంపైర్లు సవ్యంగానే వ్యవహరించారని, ఇద్దరు అంపైర్లు చర్చించిన తర్వాతే 6 పరుగులు ఇచ్చారని ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డెస్ తెలిపారు. ఓవర్ త్రోపై పరుగులు ఎన్ని ఇవ్వాలన్నది ఆన్ ఫీల్డ్ అంపైర్ల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని, ఆ సమయంలో మూడో అంపైర్ ను సంప్రదించే వెసులుబాటు లేదని స్పష్టం చేశారు. దీంట్లో మ్యాచ్ రిఫరీ జోక్యం కూడా ఉండదని అలార్డెస్ వివరించారు.

More Telugu News

Dharmasena
ICC
England
World Cup