- పాత సీఎం క్యాంపు కార్యాలయం రాజ్ భవన్ గా మార్పు
- ఆధునికీకరణ పనులు పూర్తి
- ఇప్పటికే అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది
ఏపీ నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు విజయవాడలోని రాజ్ భవన్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ లో ఏర్పాట్లు
శరవేగంగా జరుగుతున్నాయి.
పాత సీఎం క్యాంపు కార్యాలయాన్ని రాజ్ భవన్ గా మార్పు చేశారు. వారం రోజుల నుంచి ఇక్కడ సాగుతున్న ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయి. గవర్నర్ నివాసం వద్ద భద్రత నిమిత్తం ఐఎస్ డబ్ల్యూ సిబ్బంది, ఏపీఎస్పీ బెటాలియన్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి బిశ్వభూషణ్ వెళ్లి, అమ్మ వారిని దర్శించుకుంటారని, అనంతరం, రాజ్ భవన్ కు ఆయన చేరుకుంటారని సమాచారం. నూతన గవర్నర్ గా బిశ్వభూషణ్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.