Rahul Gandhi: రాహుల్ గాంధీ కొకైన్ తీసుకున్నారన్న సుబ్రహ్మణ్యస్వామి.. ఎఫ్ఐఆర్ నమోదు

  • రాహుల్‌ను అవమానించాలనే ఆ వ్యాఖ్యలు చేశారన్న కాంగ్రెస్
  • ఇలాంటి వ్యాఖ్యలతో సమాజ శాంతికి విఘాతమన్న కాంగ్రెస్
  • కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

రాహుల్ గాంధీ కొకైన్ తీసుకుంటారంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ కొకైన్ వంటి మత్తు పదార్థాలు తీసుకుంటారని కొత్వాలి నగర్ బారాబంకీలో సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. రాహుల్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు  కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పీఎల్ పునియా తెలిపారు.

చత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పవన్ అగర్వాల్ చేసిన లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు పతల్గావ్ పోలీస్ స్టేషన్‌లో సుబ్రహ్మణ్య స్వామిపై కేసు నమోదైంది. ఈ సందర్భంగా పవన్ అగర్వాల్ మాట్లాడుతూ.. స్వామి చేసిన వ్యాఖ్యలు తప్పని ఆయనకు కూడా తెలుసని అన్నారు. రాహుల్‌ను అవమానపరిచే ఉద్దేశంతోనే ఆయనీ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. పార్టీల మధ్య శత్రుత్వాన్ని పెంచి ప్రజలను రెచ్చగొట్టినట్టు అవుతుందన్న విషయం ఆయనకు తెలిసే చేశారని అన్నారు. ఇటువంటి వాఖ్యల వల్ల సమాజ శాంతికి విఘాతం కలుగుతుందని, కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

More Telugu News