JC Diwakar Reddy: మోదీతో మాట్లాడిన విధానం చూస్తేనే జగన్ అంటే ఏంటో తెలుసుకోవచ్చు: జేసీ ప్రశంసలు
టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో తెరపైకి వచ్చారు. సీఎం అయినందుకు జగన్ కు అభినందనలు తెలిపారు. గతంలో జగన్ పై రాజకీయపరమైన విమర్శలు చేశానే తప్ప ఏనాడూ ద్వేషించలేదని స్పష్టం చేశారు. అయితే జగన్ ను ఓ విషయంలో మెచ్చుకోవాలని, ప్రత్యేక హోదా అంశంలో మొదటి నుంచి ఒకే పంథాకు కట్టుబడి ఉన్నాడని, ఈ విషయంలో తొలినుంచి జగన్ నిజాయతీగా వ్యవహరిస్తున్నాడని కితాబిచ్చారు. ఢిల్లీలో మోదీతో జగన్ మాట్లాడిన విధానం చూస్తే కచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తాడనిపిస్తోందని అన్నారు. ఢిల్లీలో జగన్ మాట్లాడిన తీరుతెన్నులు అద్భుతమని జేసీ కొనియాడారు.