Hyderabad: ద్విచక్రవాహనంపై యాదగిరిగుట్టకు ప్రేమ జంట.. ప్రమాదంలో యువతి మృతి

  • ఫేస్‌బుక్ ద్వారా పరిచయం.. ఆపై ప్రేమ
  • బీబీనగర్ వద్ద అదుపుతప్పి కిందపడిన బైక్
  • వెనక నుంచి వచ్చిన కారు ఢీ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు బైక్‌పై బయలుదేరిన ఓ ప్రేమ జంట పయనం విషాదాంతమైంది. బీబీనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రేమికురాలు మృతి చెందగా, ప్రియుడు తీవ్రగాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

పోలీసుల కథనం మేరకు.. సిద్ధిపేట జిల్లా కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన దాడి శ్రీకాంత్ హైదరాబాద్‌లో ఉంటూ క్యాటరింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన అరుణ (19) నాంపల్లిలోని  వనితా మహావిద్యాలయంలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఫేస్‌బుక్‌ ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం కాగా, అది ఆ తర్వాత ప్రేమగా మారింది. గుడ్‌ఫ్రైడే సందర్భంగా శుక్రవారం సెలవుదినం కావడంతో ఇద్దరూ కలిసి బైక్‌పై యాదగిరిగుట్ట బయలుదేరారు.

పెళ్లి ఊసులు చెప్పుకుంటూ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి బయలుదేరిన వీరు బీబీనగర్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోగా, వెనక నుంచి వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీకాంత్ తలకు తీవ్ర గాయాలు కాగా, అరుణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Telangana
Lovers
Siddipet District
Mancherial District

More Telugu News