ఈవీఎంలను పక్కన పెట్టుకుని నిద్రపోయిన అధికారులు... అలసిపోయానన్న కృష్ణా జిల్లా ఆర్ఓ!

  • 12 గంటలు ఆలస్యంగా చేరిన ఈవీఎంలు
  • స్ట్రాంగ్ రూమ్ కు తరలించేందుకు తొలుత నిరాకరణ
  • చర్చనీయాంశమైన ఆర్ఓ వైఖరి
ఇప్పటికే ఏపీ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ, కృష్ణా జిల్లాలోని ఓ నియోజకవర్గ ఈవీఎంలు పోలింగ్ ముగిసిన తరువాత 12 గంటల పాటు స్ట్రాంగ్ రూమ్ కు చేరలేదన్న వార్త కలకలం రేపుతోంది. ఈవీఎంలను రిటర్నింగ్ అధికారి ఆలస్యంగా తీసుకురాగా, ఉన్నతాధికారులు సంజాయిషీ కోరడం, దీనికి సదరు అధికారి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది.

తనకు 3 రోజుల పాటు నిద్రలేదని, అందువల్ల కాసేపు పడుకున్నానని ఆ ఆర్ఓ లిఖితపూర్వకంగా రాసిచ్చారట. తొలుత ఆ ఈవీఎంలను మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు చేర్చేందుకు నిరాకరించిన పార్లమెంట్ పరిశీలకులు గణేశ్ కుమార్, అసెంబ్లీ పరిశీలకులు బినోద్ జాన్ లు, ఆపై అంగీకరించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

ఈవీఎంలను పక్కన పెట్టుకుని 12 గంటల పాటు నిద్రపోయానన్న ఆ రిటర్నింగ్ అధికారి వైఖరి ఇప్పుడు చర్చనీయాంశమైంది. 11వ తేదీ అర్ధరాత్రి పోలింగ్ ముగియగా, 12వ తేదీ రాత్రి 9 గంటలకు స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఈవీఎంలు చేరడం గమనార్హం. కాగా, ఇవి ఏ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలన్న విషయం మాత్రం బయటకు రాలేదు.
Go Back to Shorts
RO
Elections
Machilipatnam
Sleep
Strong Rooms

More Telugu News