వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

  • నవమి ఉత్సవాల్లో పాల్గొని వస్తుండగా ఘటన
  • దౌలాపూర్ శివారులో ఆటోను ఢీకొన్న లారీ 
  • తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమం
వికారాబాద్‌లో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. శ్రీరామ నవమి రెండో రోజున జుంటుపల్లి సీతారామ ఆలయంలో జరిగిన వేడుకల్లో తాండూరుకు చెందిన కొందరు భక్తులు పాల్గొన్నారు. అనంతరం తిరిగి ఇంటికి వస్తుండగా యాలాల మండలం దౌలాపూరు శివారులో వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి వీరి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో తాండూరు బండప్పబావికి చెందిన తల్లీకుమార్తెలు భారతమ్మ (50), తుల్జమ్మ (35), సాయిపురానికి చెందిన అనంతయ్య (53), ఆయన భార్య లక్ష్మి (45) ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ ఆశప్ప, చిన్నారి శశికళ పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.  
Go Back to Shorts
Telangana
Vikarabad District
Yalala
Road Accident

More Telugu News