తలసాని ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు: టీడీపీ నేత పుట్టా ఫైర్

  • వైఎస్ కుటుంబం గురించి ఎందుకు మాట్లాడట్లేదు?
  • ఏనాడూ బీసీలకు అండగా నిలవలేదు
  • అభివృద్ధిలో ముందున్నందుకేనా అంత కుటిల ప్రేమ?
  • అభివృద్ధిలో చంద్రబాబే కనిపిస్తున్నాడు
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీసీల వంచనకు వైఎస్ కుటుంబం కేరాఫ్ అడ్రస్ అని, వారికి అన్యాయం చేసిన వైఎస్ కుటుంబం గురించి తలసాని ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. బీసీల వంచనకు వైఎస్ కుటుంబం కేరాఫ్ అడ్రస్ అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో అడుగడుగునా బీసీలకు అన్యాయం జరుగుతున్నా మాట్లాడకుండా, కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేయడం కోసం జగన్‌ను తలసాని వెనకేసుకొస్తున్నారని పుట్టా విమర్శించారు.

ఓటు బ్యాంకుగా వాడుకోవడమే తప్ప కేసీఆర్ ఏనాడూ బీసీలకు అండగా నిలవలేదన్నారు. బీసీలే టీడీపీకి పునాది అని పుట్టా పేర్కొన్నారు. వైసీపీకి అధికార ప్రతినిధులు లేరని, మీరు అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారా? అంటూ నిలదీశారు. తాము అభివృద్ధిలో ముందున్నందుకే ఏపీపై మీకు అంత కుటిల ప్రేమా? అని ప్రశ్నించారు. మీకు, మీ నాయకుడు కేసీఆర్‌కు అభివృద్ధిలో చంద్రబాబే కనిపిస్తున్నాడంటూ పుట్టా ధ్వజమెత్తారు. వంది మంది కేసీఆర్‌లు వచ్చినా కూడా చంద్రబాబును ఎదుర్కోవడం కష్టమని మీకు కూడా తెలుసంటూ తలసానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో టీఆర్ఎస్ ఈసీని అడ్డుపెట్టుకుని గెలిచిందని, ఇకనైనా తలసాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని పుట్టా హెచ్చరించారు. ఏపీలో ఏర్పడేది టీడీపీ ప్రభుత్వమేనని పుట్టా ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే, దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో నిలపడమే కాకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తామన్నారు. ఏపీలో అభివృద్ధే జరగలేదని మాట్లాడే ముందు కోట్ల మంది ఆంధ్రులను అడిగితే చెబుతారన్నారు. కేసీఆర్‌లా తాము రాజకీయాలకే పరిమితం కాబోమన్నారు.
Go Back to Shorts
Talasani
KCR
KTR
Putta sudhakar yadav
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News