Uttar Pradesh: ఆ ప్రాణాంతక వైరస్ కాంగ్రెస్ పార్టీకి కూడా సోకింది: యూపీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగ్ తో జట్టు కట్టడాన్ని ఆయన ప్రమాదకరమైన చర్యగా అభివర్ణించారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఎంతో పట్టున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) తో పొత్తుపెట్టుకుంది. కేరళలో కాంగ్రెస్ 16 లోక్ సభ స్థానాల్లో పోటీచేస్తుండగా, పొత్తులో భాగంగా ఐయూఎంల్ కు 2, కేరళ కాంగ్రెస్ (మణి), సోషలిస్టు పార్టీలకు చెరో స్థానం కేటాయించారు. అంతేకాదు, ముస్లింలీగ్ ప్రాబల్యం విపరీతంగా ఉన్న వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పార్లమెంటుకు పోటీచేస్తున్నారు. దీనిపై యోగి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ముస్లిం లీగ్ వంటి ప్రమాదకరమైన వైరస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అంటుకుందని, ఒకవేళ ఎన్నికల్లో కాంగ్రెస్, ముస్లిం లీగ్ కూటమి గెలిస్తే దేశం మొత్తం ఆ వైరస్ బారినపడుతుందని హెచ్చరించారు. ముస్లిం లీగ్ వైరస్ సోకితే ఎవరూ బతికి బట్టకట్టరని యోగి వ్యాఖ్యానించారు. ఇప్పుడా వైరస్ సోకిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే దేశం పరిస్థితి ఎలా తయారవుతుందో ఊహించుకోండి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Uttar Pradesh
Congress

More Telugu News