కేసు విచారణ సందర్భంగా.. కోర్టులో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
- షాకైన న్యాయమూర్తి
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- మద్రాస్ హైకోర్టు గదిలో ఘటన
శ్రీపెరంబదూర్కు చెందిన శరవణన్ (45) కార్పొరేషన్ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య వరక్ష్మి (40). దంపతుల మధ్య తరచూ ఘర్షణ జరుగుతుండేది. వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో వారు కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగించారు. గడచిన ఐదేళ్లుగా కుటుంబ సంక్షేమ కోర్టులో ఈ కేసు నడుస్తోంది.
మంగళవారం విచారణ ఉండడంతో దంపతులు ఇద్దరూ మద్రాస్ హైకోర్టుకు వచ్చారు. చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహం ఆపుకోలేని శరవణన్ భార్యను కత్తితో పొడిచాడు. న్యాయమూర్తి కళ్లముందే ఈ ఘటన జరగడంతో తీవ్ర కలకలం రేగింది. వెంటనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలిని స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు.