Chandrababu: జగన్‌కు ఉన్న సంస్కారంలో చంద్రబాబుకు రవ్వంత కూడా లేదు!: విజయసాయిరెడ్డి

  • ఉన్నత హోదాల్లో రాజారెడ్డి హంతకులు
  • వైఎస్ మరణం వెనుక అనుమానాలు
  • జగన్‌పై హత్యాయత్నం చేశారు
  • వివేకాను బలితీసుకున్నారు

వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పూడ్చిపెట్టిన ఫ్యాక్షన్ భూతానికి చంద్రబాబు తిరిగి ప్రాణం పోయాలని చూస్తున్నారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. రాజారెడ్డి హంతకులు టీడీపీలో ఉన్నత హోదాల్లో ఉన్నారని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదం వెనుక అనేక అనుమానాలున్నాయన్నారు. జగన్‌పై కూడా హత్యా యత్నం చేశారని, ఆయన త్రుటిలో తప్పించుకున్నారని, చివరకు వివేకాను బలితీసుకున్నారని ఆరోపించారు.

తన బాబాయ్ హత్యకు గురైనప్పటికీ వైసీపీ అధినేత జగన్ ఎంతో సంయమనం పాటించారని, ఒక్క చిన్న ఘటన కూడా జరగకుండా కార్యకర్తలను నియంత్రించారన్నారు. జగన్‌కు ఉన్న సంస్కారంలో చంద్రబాబుకు రవ్వంత కూడా లేదని, పరిటాల రవి హత్య తర్వాత ఏ జిల్లాలో ఎన్ని బస్సులు తగులబెట్టాలో ఫోన్‌లో టార్గెట్ పెట్టారని ఆరోపించారు. ఒకరిపై మరొకరిని రెచ్చగొట్టి చంపుకుంటుంటే అధికారాన్ని అనుభవించవచ్చనేది చంద్రబాబు ఆలోచన అని విమర్శించారు. దానిలో భాగంగానే వివేకా హత్య జరిగిందని విజయసాయి ఆరోపించారు.

More Telugu News