Congress: కేసీఆర్, కేటీఆర్ కలిసి ఆడే వింతనాటకం నీచంగా ఉంది: భట్టి విక్రమార్క

షార్ట్స్‌లో చూడండి
సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ లపై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క విరుచుకుపడ్డారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బరితెగించి మరీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం ఎప్పుడో మానేశారని ఆరోపించారు. ఇతర పార్టీలను లేకుండా చేయడానికి కేసీఆర్, కేటీఆర్ కలిసి ఆడే వింతనాటకం నీచంగా ఉందంటూ విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ స్వతంత్ర రాజులు మాదిరిగా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్య వాదులు చూస్తూ ఊరుకుంటే ప్రమాదం అని హెచ్చరించారు భట్టి విక్రమార్క.

నలుగురైదుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్నంత మాత్రాన కాంగ్రెస్ లేకుండా పోతుంది అనుకోవడం పొరపాటని, పార్టీ ఇన్ చార్జ్ వీరప్ప మొయిలీ ఆధ్వర్యంలో మార్చి 18న గవర్నర్ ను కలుస్తామని తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ తో చర్చిస్తామని, ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరతామని వివరించారు. అవసరమైతే తెలంగాణలో రాష్ట్రపతిపాలన పెట్టాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా, దశలవారీగా ఈ ప్రభుత్వం మీద ఉద్యమం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, త్వరలోనే ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తానని, పార్టీ ఫిరాయింపులపై జాతీయ పార్టీ నాయకులను కలుస్తామని చెప్పారు భట్టి.
Go Back to Shorts
Congress
KCR
KTR
Telangana

More Telugu News