అలీ రాజకీయాల్లోకి రావాలి.. నూతన ఒరవడి సృష్టించాలి: చంద్రబాబు

  • తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అలీ సన్మాన సభ
  • గజమాలతో సత్కరించిన చంద్రబాబు
  • అలీ తల్లిదండ్రులకు అభినందన
టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు అలీ రాజకీయాల్లోకి రావాలని, వచ్చి నూతన ఒరవడి సృష్టించాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం నిర్వహించిన అలీ సన్మాన సభకు చంద్రబాబు హాజరయ్యారు. అలీ దంపతులను గజమాలతో సత్కరించారు.

ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాల్లోకి వచ్చారని, ఆ తర్వాత తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగు వారికి గుర్తింపు వచ్చిందన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత ఒక్క ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు.

అలాగే, 40 ఏళ్ల సినీ జీవితంలో అలీ కూడా ఎంతో కష్టపడ్డారని, ఓ మంచి వ్యక్తిని అభినందించాలనే ఉద్దేశంతోనే తాను ఈ కార్యక్రమంలో భాగస్వామినయ్యానని పేర్కొన్నారు. జీవితంలో రిలాక్సేషన్ రావాలంటే అలీ లాంటి వ్యక్తులు ఉండాల్సిందేనన్నారు. అలీ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించిన చంద్రబాబు ఆయనకు అన్ని వేళలా సహకరించిన కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను అభినందిస్తున్నట్టు చెప్పారు.
Go Back to Shorts
Chandrababu
Vijayawada
Actor Ali
Telugudesam
Tollywood
Andhra Pradesh

More Telugu News