Chandrababu: చంద్రబాబుపై కేసు పెడతా.. రాజశ్యామల యాగం వల్లే కేసీఆర్ సీఎం అయ్యారు: స్వరూపానందేంద్ర సరస్వతి

  • ఏపీలో అవినీతి తారస్థాయికి చేరింది
  • టీటీడీలో పాలన లోపభూయిష్టంగా మారింది
  • ఏపీలో ప్రభుత్వ మార్పుకు యాగం చేస్తా

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కేసు పెడతానంటూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి సంచలన ప్రకటన చేశారు. గుంటూరులోని గోరంట్లలో ఉన్న శ్రీ పద్మావతి అండాళ్ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి రిలిజియన్ సొసైటీ దేవస్థానంలో జరుగుతున్న సప్తదశ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తారస్థాయికి చేరుకుందని ఆరోపించారు.

ప్రభుత్వ మార్పు కోసం త్వరలోనే ఏపీలో రాజశ్యామల యాగం చేస్తానని పేర్కొన్న స్వరూపానందేంద్ర.. తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలన లోపభూయిష్టంగా మారిందన్నారు. ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయన్న స్వామి త్వరలోనే వాటిని మీడియా ముందు పెడతానన్నారు. టీటీడీ అధికారులు, సీఎం చంద్రబాబుపై కేసు పెడతానన్నారు. కోర్టులోనూ కేసు వేస్తానని హెచ్చరించారు. తాను దగ్గరుండి నిర్వహించిన రాజశ్యామల యాగం వల్లే తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చారని స్వామి పేర్కొన్నారు.

More Telugu News