Andhra Pradesh: చంద్రబాబు నో చెబితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటా!: గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు

  • బీసీ గర్జన నిర్వహణకు జగన్ కు అర్హత లేదు
  • ఒక్క బీసీని ఆయన జిల్లా అధ్యక్షులను చేయలేదు
  • విశాఖపట్నంలో మీడియాతో ఏపీ మంత్రి

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈరోజు ‘బీసీ గర్జన’ సభను నిర్వహించేందుకు వైసీపీ అధినేత జగన్ అనర్హుడని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఎక్కడా బీసీలను జిల్లా అధ్యక్షులుగా జగన్ నియమించలేదని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు బీసీ గర్జన పేరుతో హడావుడి చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. విశాఖపట్నం జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో గంటా మాట్లాడారు.

అవసరమైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానే తప్ప పార్టీ మారే ప్రసక్తే లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో ఎంతమాత్రం నిజం లేదనీ, వాటిని నమ్మవద్దని సూచించారు. తాను ఎమ్మెల్యేగా ఉండాలా? లేక ఎంపీగా వెళ్లాలా? అన్నది పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు. ఈసారి పోటీ చేయొద్దని  ఏపీ సీఎం చంద్రబాబు చెబితే మానేస్తానని గంటా అన్నారు. కొంతమంది గురించి మాట్లాడి తన ప్రతిష్ఠను దిగజార్చుకోనని స్పష్టం చేశారు.

More Telugu News