Narendra Modi: నేడు మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఇది!

  • ఉదయం 10.45కు గన్నవరం చేరుకోనున్న మోదీ
  • ఆపై 11.10కి గుంటూరు 
  • అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగం

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ ఉదయం ప్రత్యేక విమానంలో ఉదయం 10.45 గంటలకు చేరుకోనున్న మోదీకి, తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ప్రొటోకాల్ అధికారులు స్వాగతం పలకనున్నారు. ఆపై ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన ఉదయం 11.10కి గుంటూరుకు చేరుకుంటారు. కృష్ణపట్నంలో బీపీసీఎల్ కోస్టల్ టెర్నినల్ ను ఆన్ లైన్ మాధ్యమంగా ప్రారంభించనున్న ఆయన, ఓఎన్జీసీ విశిష్ఠ, ఈఓఏ, ఐఎస్పీఆర్ఎల్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.

 అనంతరం బీజేపీ ప్రజా చైతన్య సభలో పాల్గొనే మోదీ, పలు జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలు, నాయకులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తన ప్రసంగంలో ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులపై ఆయన వివరణ ఇవ్వనున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గుంటూరు సభ అనంతరం, మోదీ తిరిగి గన్నవరం చేరుకుని, ఢిల్లీకి బయలుదేరుతారు. కాగా, మోదీకి స్వాగతం పలికేందుకు రాష్ట్రంలో అధికార టీడీపీకి చెందిన నాయకులు ఎవరూ రావడం లేదు. ఈ సభను, మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు బీజేపీ కృషి చేస్తోంది.

More Telugu News