హరీశ్ రావు దత్తత గ్రామానికి జాతీయస్థాయిలో గుర్తింపు.. ప్రశంసలు కురిపించిన ప్రతినిధుల బృందం!

  • ఇబ్రహీంపూర్ ను సందర్శించిన 61 మంది టీమ్
  • నగదు రహిత గ్రామంగా ఇప్పటికే గుర్తింపు
  • టీఆర్ఎస్ కు కుంచుకోటగా మారిన ఊరు
తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీశ్ రావు దత్తత తీసుకున్న సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతోంది. ఈ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులు, నేతలు స్వయంగా వస్తున్నారు. ఇంకుడు గుంతలు, కందకాల నిర్మాణం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు మరుగుదొడ్లు సహా పలు అంశాల్లో ఇబ్రహీంపూర్ దేశంలోనే ముందుంది. అంతేకాదు... తెలంగాణలోనే తొలి నగదు రహిత గ్రామంగా ఇబ్రహీంపూర్ పేరుగాంచింది.

తాజాగా ఇబ్రహీంపూర్ సాధించిన విజయాలపై  జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ తరఫున 15 రాష్ట్రాలకు చెందిన 61 మంది ప్రతినిధులు సందర్శించారు. వీరిలో 25 మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపూర్ లో చేపట్టిన అభివృద్ధి పనులపై వీరంతా ప్రశంసలు కురిపించారు.

వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు గ్రామస్తులు తీసుకుంటున్న చర్యలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ గ్రామస్తులు ఏకకాలంలో 7 లక్షల మొక్కలు నాటి రికార్డు సృష్టించారు. అంతేకాదు... ఈ ఊరిలో మొత్తం 784 ఓట్లు ఉంటే.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్ రావుకు ఏకంగా 778 ఓట్లు పడ్డాయి.
Go Back to Shorts
Telangana
Harish Rao
adopted villege
Siddipet District
ibrahimpur
praise
national
team
visit

More Telugu News