Mithibai college: ముంబై కాలేజీలో తొక్కిసలాట.. 15 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం

  • కొలీజియం ఫెస్ట్ సందర్భంగా ఘటన
  • ఆడిటోరియం సామర్థ్యం 3 వేలు
  • పది వేల పాసుల విక్రయం

ముంబైలోని విల్లే పార్లె‌లో ఉన్న మీఠీబాయి కాలేజ్  ఫెస్టివల్‌లో జరిగిన తొక్కిసలాటలో 15 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గురువారం రాత్రి 8:30 గంటల సమయంలో నిర్వహించిన కొలీజియం ఫెస్ట్‌ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ కార్యక్రమం నిర్వహించిన హాలు సామర్థ్యం 3000 నుంచి 4000 మాత్రమే కాగా, పదివేలకు పైగా పాసులు విక్రయించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలను కాలేజీ అధికారులు కొట్టిపడేశారు. పాసులను అధికంగా విక్రయించలేదని, బయట వ్యక్తులు బలవంతంగా లోపలికి రావడంతోనే ఈ ఘటన జరిగిందని వివరించారు.

తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిని 15 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు.

More Telugu News