Rahul Gandhi: ఢిల్లీకి మారిన సీన్... రాహుల్ తో ఉత్తమ్ అత్యవసర భేటీ!

  • రాహుల్ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లిన ఉత్తమ్
  • మెజారిటీ రాకుంటే ఏం చేయాలి?
  • చర్చించనున్న రాహుల్, ఉత్తమ్

రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనతో భేటీ అయ్యాయి. రేపు ఉదయం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో వీరి భేటీ కీలకమైంది. కూటమి అభ్యర్థుల విజయావకాశాలు, జాతీయ స్థానిక సంస్థల ఎగ్జిట్ పోల్స్ పై వీరిద్దరూ చర్చించనున్నారని, కూటమిలోని పార్టీలకు మెజారిటీ సీట్లు రాకుంటే ఏం చేయాలన్న విషయమై కూడా వీరు సమాలోచనలు జరపనున్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా నిలవకుండా, కూటమి మొత్తం కలిపి మెజారిటీ సాధించిన పక్షంలో తమనే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఈ మధ్యాహ్నం కాంగ్రెస్ నేతలు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిసి విన్నవించనున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూడా రాహుల్ వద్ద ఉత్తమ్ చర్చిస్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రాహుల్ తో చర్చల అనంతరం మధ్యాహ్నం తరువాత ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరిగి హైదరాబాద్ కు చేరనున్నారు. ఆపై ఆయన అందుబాటులోని కాంగ్రెస్ నేతలతో సమావేశమై రేపటి కౌంటింగ్ ప్రక్రియపై చర్చిస్తారని తెలుస్తోంది.

More Telugu News