నన్ను కూరలోని కరివేపాకులా తీసిపడేశారు: చంద్రబాబుపై పవన్ ఆగ్రహం

  • ప్రత్యేక హోదాపై నేను మాట్లాడినప్పుడు నాకు చంద్రబాబు మద్దతు ఇవ్వలేదు
  • నా మార్యాదను తగ్గించాలనుకుంటే.. విశ్వరూపం చూపిస్తా
  • నేను మద్దతు ఇవ్వకపోతే చంద్రబాబు ఇప్పటికే రిటైర్ అయ్యేవారు
ప్రత్యేక హోదా అంశంపై తాను మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అండగా లేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇప్పుడు అదే అంశంపై తనను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తనను కూరలోని కరివేపాకులా తీసి పక్కన పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మర్యాదను, సహనాన్ని తగ్గించాలనుకుంటే విశ్వరూపం చూపిస్తానని హెచ్చరించారు. తెలుగుజాతి ఆత్మాభిమానాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పాదాల వద్ద పెడితే... తనకు బాధ కలగదా? అని ప్రశ్నించారు.

నేరాలు చేసినవారికి 14 ఏళ్లు కఠిన కారాగార శిక్షను ఎలా విధిస్తారో... కాంగ్రెస్ కు కూడా ఏపీలో 14 ఏళ్ల పాటు స్థానం లేదని పవన్ అన్నారు. దారినపోయే తద్దినాన్ని ఎవరూ ఇంట్లోకి తెచ్చి పెట్టుకోరని... ఒక్క చంద్రబాబే ఆ పని చేశారని ఎద్దేవా చేశారు. 'చంద్రబాబులా 'తమ్ముళ్లూ త్యాగాలకు సిద్ధపడండి' అని నేను అననని... తమ్ముళ్లూ మీ కోసం నేనే త్యాగాలు చేస్తాను' అని చెబుతానని అన్నారు. జగ్గంపేట బహిరంగసభలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గత ఎన్నికల్లో చంద్రబాబుకు తాను మద్దతు ఇవ్వకపోతే... ఈపాటికి ఆయన రిటైర్ అయ్యేవారని పవన్ అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే అవినీతి పెరిగిపోతుందనే భావనతో చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని... చివరకు ఆయన కూడా అవినీతిలో చిక్కుకుపోయారని విమర్శించారు. 
Go Back to Shorts
Chandrababu
Jagan
Pawan Kalyan

More Telugu News