రెండేళ్లుగా కక్ష పెంచుకున్నారు... పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు

  • నాగారం గ్రామంలో వ్యక్తి దారుణ హత్య
  • నడిరోడ్డుపై ఘోరం
  • ఇటీవలే జైలు నుంచి బెయిల్ పై బయటకువచ్చిన హతుడు
రెండేళ్లుగా వేటాడుతున్నారు. ఓసారి ఇంట్లో పెట్టి సజీవ దహనం చేయాలనుకున్నారు. అదృష్టవశాత్తు తప్పించుకున్నాడు. ప్రత్యర్ధుల కంటపడకూడదని ఊరే మార్చేశాడు. అయినా శత్రువుల కంటి నుంచి తప్పించుకోలేకపోయాడు. జైలులో ఉన్న అతను బెయిల్‌పై బయటకు రావడాన్ని తెలుసుకున్న ప్రత్యర్థులు కాపుకాసి నడిరోడ్డుపై హత్య చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో ఆదివారం ఉదయం రాజు అనే వ్యక్తి హత్యోదంతం స్థానికంగా సంచలనమయింది.

వివరాల్లోకి వెళితే... రాజు రెండేళ్ల క్రితం కృష్ణ అనే వ్యక్తితో కలిసి కొత్తూరు గ్రామానికి వెళ్లాడు. ఆ తర్వాత కృష్ణ పట్టాలపై విగత జీవిగా కనిపించాడు. కృష్ణ చనిపోవడానికి రాజే కారణమని భావించిన అతని కుటుంబ సభ్యులు రాజు కుటుంబంపై కక్ష కట్టారు. ఓసారి రాజు ఇంటికి నిప్పంటించి సజీవ దహనం చేసే ప్రయత్నం చేశారు. దీంతో ప్రమాదాన్ని ఊహించుకున్న రాజు  కుటుంబంతో షాద్‌నగర్‌కు మకాం మార్చాడు.

ఆ తర్వాత కృష్ణ మృతి కేసులో పోలీసులు రాజును అరెస్టుచేసి జైలుకు పంపారు. ఈ కేసులో ఇటీవలే రాజుకు కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆదివారం ఉదయం తండ్రితో కలిసి రాజు నాగారం గ్రామానికి వచ్చాడు. విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు అతడిని వెంబడించి బహిరంగంగా కత్తులతో నరికి చంపారు. సమాచారం అందుకున్న మహేశ్వరం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. 
Go Back to Shorts
Ranga Reddy District
maheswaram
murder

More Telugu News