Visakhapatnam District: పాపం.. ఎంత నిద్ర వచ్చిందో.. చోరీకి వచ్చి నిద్రపోయిన దొంగ!

  • విశాఖ శివారులోని వేపగంటలో ఘటన
  • హుండీ పగలగొట్టి డబ్బు మూటగట్టుకున్న దొంగ
  • తిరిగి వెళ్లే మార్గం లేక ఆలయంలోనే నిద్ర
ఆలయంలో చోరీకి వచ్చిన దొంగకు నిద్ర ముంచుకొచ్చింది. పక్కాగా చోరీ చేసినా ఆలయం నుంచి బయటపడడం అసాధ్యంగా మారింది. చివరి వరకు ప్రయత్నించాడు. అయినా ఫలితం లేకపోయింది. మరోవైపు నిద్రతో కను రెప్పలు బరువెక్కాయి. ఇక ప్రయత్నించి లాభం లేదనుకున్నాడు. అక్కడే ఎంచక్కా నిద్రపోయాడు. ఉదయం దొరికిపోయి కటకటాల పాలయ్యాడు.

విశాఖపట్టణం శివారులోని వేపగుంటలో జరిగిందీ ఘటన. స్థానిక పైడిమాంబ ఆలయంలోకి గ్రిల్స్ వంచి చొరబడిన దొంగ హుండీలను పగలగొట్టి డబ్బు తీసుకున్నాడు. ఆ డబ్బును పట్టుకుని బయటకు వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. పైకి ఎక్కడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ఆలయంలోనే నిద్రపోయాడు.  ఉదయం ఆలయ సిబ్బంది చూసి పోలీసులకు సమాచారం అందించారు. అతడిని అదుపులోకి తీసుకున్న పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News

Visakhapatnam District
Thief
Temple
Vepagunta