మనస్తాపమా? భయమా?: నూతన్ ఆత్మహత్యతో మరో మలుపు తిరిగిన బ్యూటీషియన్ పద్మ కేసు!

  • గత వారం పద్మపై దారుణంగా ప్రవర్తించిన నూతన్
  • పోలీసుల విచారణకు భయపడి ఆత్మహత్య?
  • కాల్ డేటాను విచారిస్తున్నామన్న పోలీసులు
కృష్ణా జిల్లా బావులపాడులో తాను సహజీవనం చేస్తున్న బ్యూటీషియన్ పిల్లి పద్మపై హత్యాయత్నం చేశాడని భావిస్తున్న నూతన్ నాయుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపగా, ఈ కేసు మరో మలుపు తిరిగింది. తనపై నమోదయ్యే కేసులకు, పోలీసుల విచారణకు భయపడే అతను ఆత్మహత్య చేసుకున్నాడా? లేక, తన ప్రియురాలిపై అంత దారుణానికి ఒడిగట్టానన్న మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.

పద్మపై గతవారంలో నూతన్ దాడి చేసి, దారుణంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఆమెకు మత్తిచ్చి, ఒంటిపై బట్టలన్నీ తీసేసి, కత్తితో పలుమార్లు పొడవడంతో పాటు, చేతులు నరికి, నుదుటిపై 'ఎస్' ఆకారాన్ని చెక్కి, ఆమె చనిపోయిందని భావించి, అక్కడి నుంచి పారిపోయాడు. ఆపై రెండు రోజుల తరువాత కొన ఊపిరితో ఉన్న పద్మను ఆమె భర్త గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు వెలుగులోకి వచ్చింది.

భర్తకు దూరంగా ఉంటున్న ఆమె, నూతన్ తో సహజీవనం చేస్తోందని తెలుసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నూతన్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ క్రమంలో నూతన్ ఎక్కడున్నాడన్న విషయం తెలిసిపోయిందని, అరెస్ట్ చేస్తామని పోలీసు వర్గాలు నమ్మకంగా చెప్పిన గంటల వ్యవధిలోనే నూతన్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం బయటకు వచ్చింది. నూతన్ ఆత్మహత్యకు సంబంధించి సూసైడ్ నోట్ ఏమీ లభ్యం కాలేదని, అతని కాల్ డేటాను సేకరించామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Go Back to Shorts
Pilli Padma
Nutan Kumar
Sucide
Murder Attempt

More Telugu News