ఈసీ నోటిఫికేషన్ చెల్లదు.. రాజ్యసభ ఎన్నికల్లో 'నోటా' కుదరదు!: సుప్రీం

  • రాజ్యసభ ఎన్నికలకు నోటా వర్తించదని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
  • ఎలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ ను తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం  
  • ప్రత్యక్ష ఎన్నికలకు మాత్రమే నోటా వర్తింపు అని పునరుద్ఘాటన
రాజ్యసభ ఎన్నికలలో నోటా ఆప్షన్ వినియోగంపై సుప్రీంకోర్టు ఈ రోజు కీలకమైన తీర్పునిచ్చింది. రాజ్యసభ ఎన్నికలకు నోటా వర్తించదని సుప్రీం స్పష్టం చేసింది. 'రాజ్యసభ ఎన్నికలు అన్నవి పరోక్ష ఎన్నికలు. ఈ ఎన్నికలకు నోటా వర్తించదు. ప్రత్యక్ష ఎన్నికలకు మాత్రమే నోటా వర్తిస్తుంది' అంటూ సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ తమకు నచ్చకపోతే ఉపయోగించే ఈ నోటా (నన్ ఆఫ్ ద అబౌవ్) ఆప్షన్ ను ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలకు అనుమతించడాన్ని ఆక్షేపించిన సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమీషన్ (ఈసీ) జారీ చేసిన నోటిఫికేషన్ ను తిరస్కరించింది.
 
ఈ విషయంపై గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ విప్ శైలేష్‌ మనుభాయ్‌ పార్మర్‌ దాఖలు చేసిన పిటిషన్ ను నేడు ధర్మాసనం విచారించింది. రాజ్య సభ ఎన్నికల్లో నోటాను అనుమతిస్తే అవినీతిని ప్రోత్సహించడమే అవుతుందని పార్మర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేసిన సుప్రీం నోటాపై ఎలక్షన్ కమీషన్ నిర్ణయాన్నితోసిపుచ్చింది.
Go Back to Shorts
Supreme Court
Rajya Sabha

More Telugu News