వెంటనే విధుల్లో చేరమంటూ మాజీ ఉద్యోగులకు, చనిపోయిన సిబ్బందికి ఎయిర్ ఇండియా మెయిల్స్.. తర్వాత నాలుక్కరచుకున్న సంస్థ!
- మాజీ ఉద్యోగులకు సందేశాలు, మెయిల్స్
- కంపెనీని సంప్రదించిన మాజీ సిబ్బంది
- తప్పును సరిదిద్దుకున్న ఎయిర్ ఇండియా
ఎయిరిండియాలో ప్రస్తుతం ఆటోమేటెడ్ క్రూ మేనేజ్ మెంట్ సిస్టమ్(సీఎంఎస్) వాడుతున్నారు. అయితే గతంలో వాడిన పాత సీఎంఎస్ ను ఇటీవల పొరపాటున యాక్టివేట్ చేయడంతో అసలు సమస్య మొదలైంది. దీంతో కంప్యూటర్ లో ఉన్న మాజీ ఉద్యోగుల ఈ-మెయిల్స్, ఫోన్ నంబర్లకు విధుల్లో చేరాలంటూ సీఎంఎస్ సందేశాలు పంపింది. అంతేకాకుండా ఏయే షెడ్యూల్స్ లో ఏయే విమానాలు వెళుతున్నాయో మాజీ పైలట్లు, ఎయిర్ హోస్టెస్ లకు వివరాలు అందించింది. విచిత్రం ఏమిటంటే, చనిపోయిన ఉద్యోగులకు కూడా మెయిల్స్ వెళ్లాయి. దీన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు సంస్థ ఆఫీస్ కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు. దీంతో ఎయిర్ఇండియా నాలుక్కరచుకుని, వెంటనే లోపాన్ని సరిదిద్దింది.